ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో స్వర్ణాంధ్ర విజన్ – 2047 పై ప్రత్యేకంగా చర్చించారు. ఈ విజన్ ప్రకారం, రాష్ట్ర ఆర్థికవ్యవస్థను ప్రస్తుతం రూ.16 లక్షల కోట్ల నుంచి 2047 నాటికి రూ.305 లక్షల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తలసరి ఆదాయాన్ని రూ.2.68 లక్షల నుంచి రూ.53.34 లక్షలకు పెంచడమే ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాల సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 22 కొత్త విధానాలను అమల్లోకి తీసుకువచ్చిందని గవర్నర్ వెల్లడించారు. 2024-25 ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ఆర్థికవ్యవస్థ 12.94% వృద్ధిరేటు సాధించింది. వ్యవసాయ రంగంలో 15.86%, పారిశ్రామిక రంగంలో 6.71%, సేవా రంగంలో 11.70% వృద్ధి సాధించామని గవర్నర్ తెలిపారు. ఈ విజయాల వెనుక స్వర్ణాంధ్ర విజన్-2047లో ప్రతిపాదించిన పది మార్గదర్శక సూత్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
స్వర్ణాంధ్ర విజన్-2047: పది సూత్రాలు
- పేదరికం నిర్మూలన: ఆకలితో ఎవ్వరూ ఉండకుండా, గౌరవప్రదమైన జీవితం అందరికీ.
- ఉపాధి కల్పన: యువతను ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీసుకురావడం.
- నైపుణ్యాభివృద్ధి: శ్రామిక శక్తిని భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి సన్నద్ధం చేయడం.
- నీటి భద్రత: ప్రతి కుటుంబానికి, పొలానికి, పరిశ్రమకు నీటి అందుబాటును అందించడం.
- వ్యవసాయ సాంకేతికత: సంప్రదాయ వ్యవసాయంలో సాంకేతికతను ప్రవేశపెట్టి, రైతులను ప్రోత్సహించడం.
- అత్యుత్తమ లాజిస్టిక్స్: తీరప్రాంతాన్ని అంతర్జాతీయ వర్తకానికి గేట్వేగా మార్చడం.
- క్లీన్ ఎనర్జీ: పర్యావరణ పరిరక్షణతో కూడిన ఇంధన వనరుల వినియోగం.
- బ్రాండింగ్: ‘మేడిన్ ఆంధ్రప్రదేశ్’ను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేయడం.
- స్వచ్ఛ ఆంధ్ర: పరిశుభ్రత, హరిత పరిరక్షణకు ప్రాధాన్యత.
- డీప్టెక్ ఇంటిగ్రేషన్: సాంకేతికతను ప్రతి రంగంలో ఉపయోగపడేలా చేయడం.






