ప్రశాంత పశ్చిమలో పార్సిల్ మర్డర్!! ఎవరు చేశారు? ఎందుకు చేశారు?

పశ్చిమ డెల్టా పల్లెప్రాంతంలో సర్వసాధారణంగా సాగిపోయే రోజులు ఒక్కసారిగా కలవరపాటుతో మారిపోయాయి. ఉండి మండలం యండగండిలో జరిగిన ఓ సంఘటన అక్కడి ప్రజలను నిశ్చేష్టుల్ని చేసింది. తులసి అనే మహిళ ఇంటికి వచ్చిన ఓ పార్శిల్ ఓ అనూహ్య రహస్యాన్ని బయటపెట్టింది. గృహ నిర్మాణ సామగ్రి ఉంటుందని భావించిన ఆ పెట్టెలో నుంచి కుళ్లిన దశలో ఉన్న పురుషుడి మృతదేహం బయటపడటంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మూడు పాలిథిన్ సంచుల్లో చుట్టి ఉన్న ఆ మృతదేహం సుమారు 45 ఏళ్ల వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో గ్రామంలో అనేక అనుమానాలు, ప్రశ్నలు చెలరేగాయి. ఎవరు ఆ వ్యక్తిని చంపి పార్శిల్‌లో పంపారు? ఈ ఘాతుకానికి కారకులు ఎవరు? అనేవి ప్రజల మనస్సుల్లో మెదులుతున్న ప్రశ్నలు.

పోలీసుల సమగ్ర దర్యాప్తు
తులసి ఇంటికి పార్శిల్ వచ్చిన విషయంపై తక్షణమే స్పందించిన పోలీసులు, ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి నేతృత్వంలో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. తులసి కుటుంబసభ్యులను వేర్వేరు ప్రాంతాలకు తరలించి, వాట్సాప్ కాల్‌ల డేటాను విశ్లేషిస్తున్నారు. తులసి చెల్లెలు భర్త గురువారం నుంచి కనిపించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.

మహిళ ఫోన్ కాల్ మిస్టరీ
ఓ మహిళ కిరాయికి ఆటో తీసుకురావడానికి కాల్ చేసినట్లు గుర్తించిన పోలీసులు, ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ మహిళ ఎవరు? ఆమె ఈ ఘటనతో ఆమెకి ఏమైనా సంబంధం ఉందా? అనేవి ఇంకా పోలీసుల ముందు ఉన్న ప్రధాన ప్రశ్నలు. నైలాన్ తాడుతో మెడ చుట్టడం, మృతదేహం పెట్టెలో పెట్టడం వంటి వివరాలు బయటపడటంతో కేసు మరింత ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ప్రజలు ఈ కేసులో దోషులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రశాంతమైన గ్రామంలో ఈ దారుణ సంఘటన కలకలం రేపింది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *