ప్రపంచ తెలుగు సమాఖ్య 1993లో నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ఆవిష్కృతమై, తెలుగువారి సంక్షేమం కోసం కృషి చేస్తోంది. ఈ సమాఖ్య ద్వారా హైదరాబాద్లో 1996లో రెండో మహాసభలు నిర్వహించగా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 30 ఏళ్ల తర్వాత, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి హోదాలో 12వ మహాసభలకు హాజరుకావడం తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి పునరుజ్జీవనమని ప్రపంచ తెలుగు సమాఖ్య ఛైర్పర్సన్ వీఎల్ ఇందిరాదత్ వ్యాఖ్యానించారు.
మహాసభల్లో భాగంగా బిజినెస్ సదస్సులు నిర్వహిస్తున్నామని, అనుభవజ్ఞుల సూచనల ద్వారా యువకులు స్ఫూర్తి పొంది, అంకుర సంస్థలను స్థాపిస్తారన్నది మా ఆలోచన అని తెలిపారు. 2015లో చంద్రబాబునాయుడు విశాఖ కైలాసగిరిపై తెలుగు సాంస్కృతిక నికేతన్ పేరిట సమాఖ్య నెలకొల్పిన తెలుగు మ్యూజియం ప్రారంభించారు. దాన్ని దేశ విదేశాల నుంచి వచ్చే వారికి దర్శనీయ ప్రదేశంగా చేయాలన్నది నా కోరిక అని ఆమె వ్యక్తం చేశారు.






