హిందూ దేవాలయాల నిర్వహణపై ప్రభుత్వ హస్తం తొలగించి, చిన్న గుడి నుంచి తిరుమల వెంకటేశ్వరుడి ఆలయం వరకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలని స్వామీజీలు, ధార్మిక సంస్థల ప్రతినిధులు కోరారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువూ కంకణబద్ధులవ్వాలని, గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని సూచించారు. కృష్ణాజిల్లా కేసరపల్లిలో విశ్వహిందూ పరిషత్తు ఆధ్వర్యంలో జరిగిన ‘హైందవ శంఖారావం’ సభలో ఈ తీర్మానాలు చేశారు.
సినిమాల్లో హైందవ ధర్మాన్ని అపహ్యం చేస్తున్నారు!!
హైందవ ధర్మంపై కొన్ని చిత్రాలు దాడి చేస్తున్నాయని సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. “సినిమాల్లో వినోదం కోసం వ్యాస, వాల్మీకి రామాయణాలను వక్రీకరించడం దుర్మార్గం. ఇస్కాన్ వారి ‘హరే రామ హరే కృష్ణ’ నినాదాన్ని ఐటమ్ సాంగ్గా వాడటం బాధాకరం. హిందూ పదాలు కళంకితమవుతాయనే ఆందోళనతో ఒక సంగీత దర్శకుడి పాటను తిరస్కరించిన సందర్భం కూడా ఉంది. హైందవ ధర్మ విలువలను కాపాడడంలో సినీరంగం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి” అని ఆయన పేర్కొన్నారు.





