‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు.
పార్టీ తరపున పవన్ కళ్యాణ్ సాయం
ఈ ప్రమాదం కాకినాడ – రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు నిర్వహణ లేకపోవడం వల్ల జరిగిందని పవన్ తెలిపారు. ‘‘ఈ రోడ్డు కొన్నేళ్లుగా పాడైపోయి, సరైన నిర్వహణ లేక ప్రమాదాలకు కేంద్రమైంది. ఇదే రోడ్డుపై ప్రమాదం జరగడం బాధాకరం. జనసేన తరఫున మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నాం. అదేవిధంగా, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందేలా చూడాలని నా కార్యాలయానికి ఆదేశాలు ఇచ్చాను’’ అని పవన్ పేర్కొన్నారు.
నిర్మాత దిల్ రాజు సానుభూతి
ఈ ఘటనపై ‘గేమ్ ఛేంజర్’ చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా స్పందించి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. ఈ ఘటన రెండు కుటుంబాలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. రోడ్డు నిర్వహణ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.





