ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ విచారణకు హాజరు కాకుండానే లిఖితపూర్వక స్టేట్మెంట్ను ఏసీబీ డీఎస్పీకి అందజేశారు. తనపై ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత, తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని స్టేట్మెంట్లో కేటీఆర్ ప్రస్తావించారు. ఏసీబీ తనకు నోటీసులు పంపినప్పటికీ, అందులో కోరిన పత్రాలపై స్పష్టత లేకపోవడంతో కొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాను రాజ్యాంగ, చట్టపరమైన హక్కులను వినియోగించుకుంటూనే, కేసు దర్యాప్తులో సహకరిస్తానని తెలిపారు. హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వ్లో ఉండటంతో, తీర్పు వచ్చేవరకు విచారణకు గడువు ఇవ్వాలని కోరారు.
ఏసీబీ చర్యలు
కేటీఆర్ విచారణకు హాజరుకాకపోవడం, తీవ్ర ఆరోపణలు చేయడంపై ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేయబోతోందని సమాచారం. హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు విచారణకు హాజరుకావచ్చని కోర్టు చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, కేటీఆర్ ఆరోపణలపై కోర్టులో మెమో వేయాలని ఏసీబీ నిర్ణయించింది. కేటీఆర్ వెంట వచ్చిన లాయర్ను అనుమతించలేదన్న అంశంపై కూడా ఏసీబీ క్లారిటీ ఇచ్చింది. కోర్టు ఆదేశాలు లేనందునే లాయర్ను అనుమతించలేదని స్పష్టం చేసింది.





