పిఠాపురంలో జరిగిన పల్లె పండగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “మీరిచ్చిన విజయం నా గాయాలకు మందు” అని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ, “సంక్రాంతి వేడుకలను ఊరంతా పందిరి వేసి జరుపుకోవాలని అనుకున్నా, తిరుపతిలో జరిగిన ఘటన వల్ల బాధ కలిగింది. అందుకే, ఈసారి పాఠశాలకే పరిమితం చేశాం. వచ్చే ఏడాది సంక్రాంతి ఘనంగా జరుపుకుందాం” అని అన్నారు. పవన్ కళ్యాణ్, పిఠాపురం నియోజకవర్గ ప్రజల సంకల్పం తనకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు.
ప్రజల సమస్యలు, పోలీసుల వ్యవస్థపై విమర్శలు
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “పోలీసుల ఉదాసీనతపై ఫిర్యాదులు వస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలి” అని సూచించారు. చిల్లర దొంగతనాలు పెరిగాయని, గంజాయి వాడకం కూడా పెరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “మా నాన్న కష్టం చూశా. నిజాయితీగా ఉండే మనిషి ఎలా నలిగిపోతాడో చూశాను” అని పవన్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, నాయకులు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.





