తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి భేషజాలు లేకుండా అందరి సహకారం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో మహారాష్ట్ర, తమిళనాడు మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు రచించిన ‘ఉనిక’ (స్వీయచరిత్ర) పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా సీఎం రేవంత్ పలు అంశాల్ని ప్రస్తావించారు.
కేంద్రంతో సమన్వయానికి పిలుపు
రాష్ట్ర ప్రగతికి కేంద్ర సహకారం కీలకమని, రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, భాజపా కీలక నేతలు ప్రధానితో చర్చించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులు పొందేలా కృషి చేయాలని సీఎం సూచించారు. మెట్రోరైల్ విస్తరణకు అవసరమైన అనుమతులు సాధించేందుకు కేంద్రమంత్రి బండి సంజయ్ మద్దతు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గవర్నర్లు బండారు దత్తాత్రేయ, కంభంపాటి హరిబాబు, కేంద్రమంత్రి బండి సంజయ్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 2028 ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి పతకాలు సాధించడం రాష్ట్ర లక్ష్యంగా ఉందని, యూనివర్సిటీలకు పూర్వవైభవం తీసుకురావడానికి కృషి కొనసాగుతుందని సీఎం తెలిపారు.





