ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. దిల్లీలోని 6-అశోకా రోడ్డులో ఉన్న కిషన్రెడ్డి నివాసంలో జరిగిన ఈ వేడుకలు తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా అత్యంత ఘనంగా జరిగాయి. సాయంత్రం ప్రధానిని దంపతులు, సినీనటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ఇతర ప్రముఖులతో కలిసి సాదరంగా ఆహ్వానించారు. వేడుకల్లో ప్రధాని తులసి కోటకు పూజలు చేసి భోగిమంట వెలిగించారు. గంగిరెద్దులకు ఆహారం అందించి సంప్రదాయ బహుమతులు పంపిణీ చేశారు. కళాకారుల ప్రదర్శనను తిలకించిన ప్రధాని వారికి నమస్కారాలు తెలిపారు.

పండగకు ప్రధాని సందేశం
వేదిక వద్ద జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించిన మోదీ, ‘‘సంక్రాంతి, పొంగల్ మన సంస్కృతి, వ్యవసాయ సంప్రదాయాల్లో కీలకమైన పండుగలు. పంటల చేతికొచ్చే ఈ వేళ, దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని తన ‘ఎక్స్’ ఖాతాలో సందేశం ఇచ్చారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా ఈ సందర్భంలో సంబరాల్లో పాల్గొని, ‘‘దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో సంక్రాంతి జరుపుకోవడం మన జాతీయ ఐక్యతకు నిదర్శనం’’ అని అభిప్రాయపడ్డారు.





