ఉచిత నివాస స్థలాలు: మహిళల పేరిట ఉచిత నివాస స్థలాల పట్టాలను అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అర్హతలు: ఈ పథకం బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే వర్తించనుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఉచిత నివాస స్థలాల పట్టాలను మహిళల పేరిట అందజేస్తామని ప్రకటించింది. పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు మాత్రమే ఈ పట్టాలు అందజేయబడతాయని తెలిపారు. గత మంత్రివర్గ సమావేశంలో ‘అందరికీ ఇళ్లు’ పథకం అమలుకు ఆమోదం తెలిపిన మేరకు ప్రభుత్వం నివాస స్థలాల పంపిణీపై జీఓ-23ను జారీ చేసింది.
ముఖ్య నిబంధనలు ఇలా..!!
- ఉచిత నివాస స్థల పట్టా: అర్హులకు జీవితకాలంలో ఒకసారే ఉచిత నివాస స్థల పట్టా అందజేస్తారు.
- అర్హతలు: లబ్ధిదారులు రాష్ట్రంలో మరెక్కడా సొంత స్థలం లేదా ఇల్లు ఉండకూడదు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గృహ పథకాల్లో లబ్ధి పొంది ఉండకూడదు.
- భూమి పరిమితి: లబ్ధిదారుకు అయిదెకరాల మెట్ట లేదా 2.5 ఎకరాలకు మించి మాగాణి భూమి ఉండకూడదు.
- ఈ పథకం క్రింద పొందిన స్థలాలకు 10 సంవత్సరాల అనంతరం యాజమాన్య హక్కులు ఇవ్వబడతాయి.
- గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన స్థలాలు, లేఅవుట్లలో లబ్ధిదారులు నిర్మాణానికి ఆసక్తి చూపకుంటే వాటిని రద్దు చేస్తారు. శ్మశానాలకు దగ్గరగా, ముంపు సమస్యలు ఉన్న కేటాయింపులను రద్దు చేయడానికి కలెక్టర్లకు అధికారాన్ని ఇచ్చారు.
స్థలాల ఎంపికకు ప్రత్యేక నిబంధనలు
- ప్రభుత్వ స్థలాలు లేదా అవసరానికి మించి ఉన్న భూములను కేటాయిస్తారు.
- ప్రత్యేక పరిస్థితుల్లోనే ప్రైవేట్ భూములను కొనుగోలు చేస్తారు.
- ఎసైన్డ్ భూముల యజమానులకు నష్టపరిహారం చెల్లించి భూములను సేకరిస్తారు.
- దాతలు ఉచితంగా భూములు ఇవ్వడానికి ముందుకొస్తే వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.






