- ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు భారీగా నిధులు కేటాయించే అవకాశం
- ఆదాయ పన్ను మినహాయింపు పెరిగే అవకాశంపై ఉత్కంఠ
కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను సమర్పించనున్నారు. ఇది 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ కావడం గమనార్హం. మధ్య తరగతి పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఊరట లభించబోతుందనే ఆసక్తి నెలకొంది. కొత్త పథకాలు ప్రవేశపెడతారా? ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను కొనసాగిస్తారా? అనే అంశంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ కొనసాగింపు
ఇళ్లులేని పేద, మధ్య తరగతి ప్రజలకు గృహనిర్మాణ సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ పథకాన్ని కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. పట్టణాల్లో రూ.2.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే ఈ పథకానికి ఈసారి మరింత నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేందుకు కేంద్రం కొత్త ప్రణాళికలు ప్రవేశపెట్టనుందని అంచనా. ముఖ్యంగా స్టార్టప్లకు మరింత రాయితీలు అందించే అవకాశం ఉంది.
ఆదాయపన్ను మినహాయింపు పెరగనున్నదా?
ప్రస్తుతం రూ.3 లక్షల ఆదాయానికి పన్నుమాఫీ ఉండగా, దీన్ని రూ.5 లక్షల వరకు పెంచే అవకాశంపై చర్చ జరుగుతోంది. అయితే, ప్రభుత్వానికి ఆదాయం తగ్గే ప్రమాదం ఉన్నందున తుది నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.






