ఏపీలో బర్డ్‌ ఫ్లూ కలకలం – తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో హెచ్చరిక!!

రాష్ట్రంలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని రెండు కోళ్ల ఫారాల్లో బర్డ్‌ ఫ్లూ (H5N1) వైరస్‌ సోకినట్లు ల్యాబ్‌ పరీక్షల్లో తేలింది. పెరవలి మండలం కానూరు అగ్రహారం, తణుకు మండలం వేల్పూరులో విపరీతంగా కోళ్లు చనిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోళ్ల నుంచి సేకరించిన నమూనాలను భోపాల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైసెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌ పరిశీలించగా, రెండు ఫారాల్లో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో పశుసంవర్ధకశాఖ అధికారులు తక్షణమే స్పందించి, ఆ ఫారాల్లోని కోళ్లు, గుడ్లను పూడ్చిపెట్టే చర్యలు చేపట్టారు. అలాగే వైరస్‌ నియంత్రణకు పరిసర ప్రాంతాల్లో కిలోమీటరు మేర రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. దుకాణాల మూసివేతతో పాటు, స్థానికంగా చికెన్‌ విక్రయాలపై తాత్కాలిక నిషేధం విధించారు.

వైరస్‌ వ్యాప్తికి వలస పక్షులు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. వివిధ దేశాల నుంచి వచ్చే ఈ పక్షుల ద్వారా నీటి మూలాల నుంచి కోళ్లకు వైరస్‌ సంక్రమించే అవకాశముందని తెలిపారు. అయితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వైరస్‌ ప్రభావం తగ్గే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మాంసం, గుడ్లు తినడంలో ఎలాంటి ప్రమాదం లేదని, ఉడికించిన ఆహారంలో ఈ వైరస్‌ జీవించదని ఎన్టీఆర్‌ పశువైద్య కళాశాల నిపుణులు స్పష్టం చేశారు. బర్డ్‌ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు కొనసాగుతున్నాయని, మిగిలిన ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదం లేదని పశుసంవర్ధకశాఖ అధికారులు తెలిపారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *