రాష్ట్రంలోని మహిళలకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడిస్తూ, స్టెమ్ కోర్సుల్లో మెరుగైన అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మహిళలు సైన్స్ రంగంలో సాధిస్తున్న విజయాలను ప్రశంసిస్తూ, కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కోవిడ్ అనంతర మార్పుల నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోం కీలకత పెరిగిందని, ఈ విధానం మహిళలకు అనువుగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ పాలసీ 4.0 – గేమ్ ఛేంజర్
రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధికి ఏపీ ఐటీ, జీసీసీ పాలసీ 4.0 ప్రధాన పాత్ర పోషించనుందని సీఎం వెల్లడించారు. ప్రతి నగరం, పట్టణం, మండల స్థాయిలో ఐటీ కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. రిమోట్ వర్క్, కోవర్కింగ్ స్పేస్, నైబర్ హుడ్ వర్క్ స్పేస్ వంటి విధానాలు సమర్థవంతమైన వాతావరణాన్ని రూపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. మహిళల ఉపాధిని పెంచేందుకు ఐటీ, జీసీసీ సంస్థలకు మద్దతు అందిస్తామని, దీని ద్వారా మెరుగైన జీవనోత్సాహం లభిస్తుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.





