- జగన్ నేర సామ్రాజ్యాన్ని అంతమొందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్య
- సత్యవర్ధన్ కిడ్నాప్ ఘటనపై వంశీని తప్పుబట్టిన టీడీపీ
వైఎస్సార్సీపీ పాలనలో నేర రాజకీయాలు ఊపందుకున్నాయి అని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఒక అరాచకవాది మరో అరాచకవాదిని వెనకేసుకొస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది అని మండిపడ్డారు. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి, వంశీ స్వయంగా తన కారులో కోర్టుకు తీసుకెళ్లడం దుర్మార్గం అని వ్యాఖ్యానించారు. వ్యక్తిత్వహననానికి పాల్పడిన వంశీకి జగన్ సహకారం అందించడం అత్యంత దారుణం అని పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, వంశీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వంశీపై అన్ని ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని, వీడియోలతో సహా అతను అడ్డంగా దొరికిపోయాడని వెల్లడించారు. గత 5 ఏళ్ల వైఎస్సార్సీపీ అరాచక పాలనలో దళితులు, మహిళలు అనేక అవమానాలు ఎదుర్కొన్నారని ఆరోపించారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వ్యక్తుల వల్లే వైఎస్సార్సీపీ ప్రతిష్ట దిగజారిందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం నడుస్తున్నందువల్ల చట్టం తన పని తాను చేసుకుంటుందని, తప్పించుకోవడానికి జగన్, వంశీ ప్రయత్నాలు విఫలమవుతాయని అన్నారు.





