- బీజేపీ అధిష్ఠానం రేఖా గుప్తాను దిల్లీ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది.
దిల్లీ తొమ్మిదో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. షాలిమార్బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన 50 ఏళ్ల రేఖా గుప్తాకు ఈ బాధ్యత అప్పగించారు. పలువురు సీనియర్ నేతల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ, బీజేపీ అధిష్ఠానం రేఖా గుప్తా వైపే మొగ్గు చూపింది. రేఖా గుప్తా తన రాజకీయ జీవితాన్ని ఏబీవీపీ నుంచి ప్రారంభించారు. దిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా కూడా గతంలో సేవలందించారు. ఆమె దిల్లీకి నాలుగో మహిళా సీఎంగా సేవలందించనున్నారు, గతంలో సుష్మాస్వరాజ్ (బీజేపీ), షీలా దీక్షిత్ (కాంగ్రెస్), ఆతిశీ (ఆప్) ముఖ్యమంత్రులుగా పనిచేశారు.
జులై 19, 1974లో హరియాణాలో జన్మించిన రేఖా గుప్తా, చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ భావజాలం వైపు ఆకర్షితురాలయ్యారు. 1996లో దిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికై రాజకీయాల్లో అడుగులు వేసారు. విద్యార్థుల సంక్షేమం, యువత సాధికారత అంశాలపై ఆమె దృష్టి సారించి పనిచేశారు. 2007, 2012లో ఉత్తరి పీతమ్పుర నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా విజయం సాధించారు. దిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా, మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా వివిధ బాధ్యతల్లో ఆమె పనిచేశారు.
పలువురి అభినందనలు!!
- “రేఖా గుప్తాకు హృదయపూర్వక అభినందనలు. మీరు దిల్లీలో తల్లులు, సోదరీమణుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తారని నమ్ముతున్నాను” – అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.
- “రేఖా గుప్తాకు అభినందనలు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ఆశిస్తున్నాను” – ఆప్ నేత ఆతిశీ.
- “దిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఆమె నెరవేరుస్తారని ఆశిస్తున్నాను” – కేజ్రీవాల్, ఆప్ అధినేత.





