- అక్కినేని కుటుంబానికి అత్యంత సమీపమైన యద్దుల అయ్యప్పరెడ్డి కన్నుమూత
- “మా నాన్నగారి వీరాభిమాని.. మా కుటుంబానికి మూలస్తంభం” – ఎమోషనల్ పోస్ట్ చేసిన నాగ్
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున తన కుటుంబానికి దగ్గరైన ఒక ముఖ్యమైన వ్యక్తి మృతి చెందారని భావోద్వేగ పోస్ట్ చేశారు. ఆయన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు వీరాభిమాని అయిన యద్దుల అయ్యప్పరెడ్డి ఇక లేరని ఎక్స్ ద్వారా ప్రకటించారు. “మా కుటుంబానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి యద్దుల అయ్యప్పరెడ్డి మరణించడం నన్ను చాలా బాధించింది. ఆయన మా నాన్నగారి వీరాభిమాని. నాన్నగారి వల్ల మాకు మరింత దగ్గరయ్యారు. ఇన్నేళ్లుగా అక్కినేని కుటుంబానికి మూలస్తంభంలా నిలిచారు. మా ఫ్యామిలీ మీద ఆయన చూపిన ప్రేమ, అభిమానం ఎప్పటికీ మరిచిపోలేను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.. ఈ కష్ట సమయం నుంచి వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను,” అంటూ నాగార్జున సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. యద్దుల అయ్యప్పరెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి. అక్కినేని నాగేశ్వరరావు జీవితాంతం వీరాభిమానిగా ఆయన కుటుంబానికి ఎంతో సేవ చేశారు. అక్కినేని ఫ్యామిలీకి అత్యంత నమ్మకస్తుడిగా, విశ్వసనీయంగా మద్దతుగా నిలిచేవారు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్ సినిమాల విడుదలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ అందరి చేత ప్రశంసలు అందుకున్నారు.





