- సూపర్ సిక్స్ పథకాలకు భారీగా నిధులు కేటాయింపు.
- రైతులకు 20 వేలు, తల్లులకు 15 వేలు అందించేలా ప్రణాళిక.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేసింది. సూపర్ సిక్స్ పథకాలతో పాటు మేనిఫెస్టోలోని ఇతర హామీలను అమలు చేసేందుకు భారీగా నిధులు కేటాయించింది. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు 20 వేలు, తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థి తల్లికి 15 వేలు అందించేలా ప్రణాళికలు రూపొందించింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ చేయనున్నారు.
ఇతర సంక్షేమ పథకాలు
కార్పొరేట్ వైద్యం అందేలా 25 లక్షల రూపాయలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, చేనేత మగ్గాలపై ఆధారపడేవారికి 200 యూనిట్ల వరకు, మరమగ్గాలపై ఆధారపడేవారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు కూడా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారు. వృద్ధుల సంరక్షణ కోసం 12 వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. టిడ్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని 10 వేల నుంచి 20 వేలకు పెంచారు. ఆదరణ పథకం పునఃప్రారంభించారు.
నిధుల కేటాయింపులిలా..!
తల్లికి వందనం కోసం 9,407 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం 27,518 కోట్లు, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి 19,264 కోట్లు, దీపం 2.0 పథకానికి 2,601 కోట్లు, ఆదరణ పథకానికి 1000 కోట్లు, మత్స్యకార భరోసాకు 450 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు 6,318 కోట్లు, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం 4,332 కోట్లు కేటాయించారు.





