మాక్స్‌వెల్ ఒక్కడితో ఆడటానికి రాలేదు: అఫ్గాన్ కెప్టెన్ షాహిది!!

  • ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు అఫ్గాన్ కెప్టెన్ వ్యాఖ్యలు.
  • మాక్స్‌వెల్‌ను ఎదుర్కోవడానికి ప్రత్యేక ప్రణాళికలు లేవన్న షాహిది.

అఫ్గానిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిదికి కోపం వచ్చింది. తాము ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచేందుకు వచ్చామని, కేవలం ఒక్క వ్యక్తితో పోటీపడటానికి కాదంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్‌కు ముందు విలేకరులు అడిగిన ప్రశ్నే ఇందుకు కారణం.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో తమ ఆరంభ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడిన అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్‌పై గెలుపుతో సెమీస్ రేసులో నిలిచింది. రెండో మ్యాచ్‌లో బట్లర్ బృందాన్ని ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో ఓడించి టోర్నీ నుంచి బయటకు పంపిన అఫ్గాన్ జట్టు, ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది మీడియాతో మాట్లాడగా, ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ గురించి ప్రశ్న ఎదురైంది. మాక్సీ కోసం అఫ్గాన్ ఎలాంటి ప్రణాళికలు రచించిందని విలేకరులు అడుగగా, “మీకేం అనిపిస్తోంది?… కేవలం మాక్స్‌వెల్‌తో ఆడేందుకే మేము ఇక్కడికి వచ్చాం అనుకుంటున్నారా? దయచేసి అలా ఆలోచించవద్దు. మేము మొత్తం ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్నాము. అందుకు తగ్గ వ్యూహాలు మా దగ్గర ఉన్నాయి. వన్డే వరల్డ్‌కప్-2023లో మాక్స్‌వెల్ అద్బుతంగా ఆడాడని నాకూ తెలుసు. కానీ అదంతా గతం. ఆస్ట్రేలియాను ఓడించాం. ఆ మ్యాచ్ తర్వాత మేము టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియాను ఓడించాం. ప్రత్యర్థి జట్లు అన్నీ మాకు సమానమే. అన్ని మ్యాచ్‌లకు మేము పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతాము. అంతేగానీ.. ఒక్క ఆటగాడిని ఎదుర్కొనేందుకు మేము ఇక్కడకు రాలేదు. మాక్స్‌వెల్‌తో పాటు ఆసీస్ జట్టు మొత్తాన్ని ఎదుర్కునేందుకు అత్యుత్తమ స్థాయిలో రాణించాలని భావిస్తున్నాం” అంటూ కౌంటర్ ఇచ్చాడు.

మాక్స్‌వెల్ మాయాజాలం

భారత్ వేదికగా 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నీలో అఫ్గానిస్తాన్ అదరగొట్టిన విషయం తెలిసిందే. పాకిస్తాన్, ఇంగ్లండ్‌ను ఓడించడంతో పాటు ఆస్ట్రేలియాను ఓడించినంత పనిచేసింది. అయితే, అఫ్గాన్ చేసిన 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ కష్టాల్లో కూరుకుపోయిన వేళ మాక్స్‌వెల్ పరుగుల తాండవం చేశాడు. అద్భుత బ్యాటింగ్‌తో ఏకంగా 201 పరుగులతో అజేయంగా నిలిచి కంగారూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా సెమీస్ చేరుకోవాలన్న అఫ్గానిస్తాన్ ఆశలకు గండిపడగా, ఫైనల్లోనూ గెలిచిన ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది. అయితే, ఈ మ్యాచ్ తర్వాత అఫ్గాన్-ఆసీస్ టీ20 ప్రపంచకప్-2024లో తలపడగా, ఈసారి హష్మతుల్లా బృందం పైచేయి సాధించి సెమీ ఫైనల్ చేరుకుంది. ఇక వన్డేల్లో మాత్రం ఇప్పటి వరకు అఫ్గానిస్తాన్-ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్‌లలో తలపడగా, నాలుగింట ఆసీస్ విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ తాజా మ్యాచ్‌లో గనుక అఫ్గాన్ గెలిస్తే సరికొత్త చరిత్ర ఆవిష్కృతం కావడంతో పాటు, ఆసీస్‌ను బయటకు పంపి సెమీస్‌కూ చేరి కొత్త రికార్డు సాధిస్తుంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *