- భర్త మరణంతో కుటుంబ బాధ్యతలు చేపట్టిన నీలమ్మ
- శ్మశానాన్ని దేవాలయంగా భావిస్తూ జీవనోపాధిగా చేసుకున్న వృద్దురాలు
కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్కు చెందిన 70 ఏళ్ల నీలమ్మ గత 30 ఏళ్లుగా శ్మశానంలో నివసిస్తూ జీవనం కొనసాగిస్తోంది. 1975లో వివాహమైన నీలమ్మ భర్త శ్మశానంలో సమాధులు తవ్వే పని చేసేవాడు. అయితే 2005లో ఆయన మరణించడంతో, కుటుంబ పోషణ బాధ్యత నీలమ్మపై పడింది. భర్త వృత్తినే కొనసాగిస్తూ ఆమె ఇప్పటివరకు 5,000కి పైగా సమాధుల కోసం గోతులు తవ్వింది. మైసూర్లోని వీరశైవ రుద్రభూమి శ్మశానవాటికలోనే నీలమ్మ తన కొడుకు, కోడలు, మనవళ్లతో నివసిస్తోంది. ఆమెను శ్మశాన జీవితం భయపెట్టలేదని, అదంతా అపోహ అని చెబుతోంది. “ఇక్కడ పాములు, నెమళ్లు, ఇతర జంతువులతో మా కుటుంబం జీవిస్తోంది. దెయ్యాలు ఉన్నాయనుకోవడం అజ్ఞానం” అని నీలమ్మ చెప్పింది.
“చనిపోయే వరకు ఈ పని చేస్తాను”
ఒక మృతదేహానికి సమాధి తవ్వడానికి దాదాపు మూడు గంటలు పడుతుందని, మొదట్లో రూ.150 తీసుకునేదానని, ఇప్పుడు రూ.1,500 తీసుకుంటున్నట్లు నీలమ్మ వివరించింది. ఏదైనా జాలి కోసం ఎదురు చూడకుండా శ్రమతో జీవిస్తున్నానని పేర్కొంది. భవిష్యత్తును కూడా నీలమ్మ స్పష్టంగా నిర్ణయించుకుంది. తాను, తన కుమారులు మరణించిన తర్వాత తమ శరీరాలను మైసూర్ మెడికల్ కాలేజీకి దానం చేయాలని నిర్ణయించుకున్నామని వెల్లడించింది. “నా భర్త మృతదేహాన్ని ఇంటి పక్కనే ఖననం చేశాం. రోజూ నిద్ర లేవగానే ఆయన సమాధినే చూస్తాను. ఎవరికీ భారం కాకుండా జీవించి, అలాగే మరణించాలని నా కోరిక” అని నీలమ్మ తెలిపింది.





