- అనుచిత వ్యాఖ్యల కేసులో కర్నూలు న్యాయమూర్తి రిమాండ్ విధింపు
- కేసులు కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన పోసాని
వైఎస్సార్సీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కర్నూలు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఇటీవల సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్లపై చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి గుంటూరు జైలులో రిమాండ్లో ఉన్న పోసానిని, ఆదోని పోలీసులు తమకు అప్పగించాలని కోరారు. అనుమతి అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టులో వాదనలు విన్న న్యాయమూర్తి, పోసానిని 14 రోజుల పాటు రిమాండ్లో ఉంచాలని తీర్పు ఇచ్చారు. అయితే, తన ఆరోగ్యం బాగోలేదని, కర్నూలు హెడ్క్వార్టర్స్లోనే ఉంచాలని పోసాని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయనను కర్నూలు జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు.
హైకోర్టులో పోసాని పిటిషన్
తనపై కేసులు అన్యాయంగా పెట్టారని పోసాని హైకోర్టును ఆశ్రయించారు. “నా వ్యాఖ్యలు సామాజిక విద్వేషాలను రెచ్చగొట్టేలా లేవు. వ్యక్తిగత విమర్శలకే కేసులు పెడితే, స్వేచ్ఛాయుతమైన అభిప్రాయాలకు ఏమవుతుంది?” అని ప్రశ్నించారు.అంతేగాక, పోలీసులు సెక్షన్ 41-A ప్రకారం ముందుగా నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాల్సిందని, కానీ తప్పుడు సెక్షన్లను ప్రయోగించారని ఆరోపించారు. విజయవాడ, అనంతపురం, శ్రీకాకుళం, కర్నూలు స్టేషన్లలో తనపై నమోదైన కేసులను రద్దు చేయాలని హైకోర్టును కోరారు.





