లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ పోరును ఉధృతం చేస్తున్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు మార్చి 22న చెన్నైలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరుకావాలని కోరుతూ 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు ఆయన ఆహ్వానాలు పంపుతున్నారు.
డీలిమిటేషన్ వల్ల ప్రభావితమయ్యే రాష్ట్రాలను ఏకతాటిపైకి తీసుకురావడం స్టాలిన్ లక్ష్యం.. మార్చి 22న చెన్నైలో సమావేశం నిర్వహించనున్న స్టాలిన్.
మార్చి 5న చెన్నైలోని తమిళనాడు సచివాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో 58 పార్టీలు పాల్గొన్నాయి. డీలిమిటేషన్ వల్ల ప్రభావితమయ్యే రాష్ట్రాలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా ఉమ్మడి కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అందుకే స్టాలిన్ వివిధ రాష్ట్రాల సీఎంలకు, ముఖ్య రాజకీయ నేతలకు తమ మంత్రుల ద్వారా ఆహ్వానాలు పంపుతున్నారు.
ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకె శివకుమార్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, ఏపీ మాజీ సీఎం జగన్మోహన రెడ్డి, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు స్వయంగా లేఖలు రాశారు స్టాలిన్. వీటిని తమ మంత్రులకు ఇచ్చి ఆయా రాష్ట్రాల సీఎంలను నేరుగా ఆహ్వానించమని చెప్పారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు మార్చి 22న నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని వారందరినీ కోరాలని సూచించారు. 1





