- పార్టీలో రాజశేఖర్కు ఉన్నత పదవులు ఇచ్చి గౌరవించాం – విడదల రజిని
- పదవులు దక్కలేదన్న ఆరోపణలు అసత్యం
- వైఎస్సార్సీపీ ఎన్నడూ మోసం చేయలేదని స్పష్టం చేసిన మాజీ మంత్రి
మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చేసిన ఆరోపణలకు మాజీ మంత్రి, చిలకలూరిపేట వైఎస్సార్సీపీ ఇంఛార్జి విడదల రజిని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ఎప్పుడూ మర్రి రాజశేఖర్ను మోసం చేయలేదని, అతనికి గౌరవం ఇచ్చి పదవులు కట్టబెట్టిందని ఆమె స్పష్టం చేశారు.
“గౌరవం దక్కలేదనడం నిజం కాదు”
శుక్రవారం మీడియాతో మాట్లాడిన విడదల రజిని మాట్లాడుతూ, “మర్రి రాజశేఖర్ నిన్న పార్టీకి రాజీనామా చేశారు. కానీ ఆయన చేసిన ఆరోపణలు అసత్యం. 2004లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన రాజశేఖర్ కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వయంగా ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీలో చేరిన తర్వాత జగన్మోహన్రెడ్డి ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. 2014లో ఓడినా కూడా ఆ బాధ్యతల్లో కొనసాగించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు గౌరవం దక్కలేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది” అని విమర్శించారు. “రెడ్ బుక్ పాలనలో, వైఎస్సార్సీపీపై టీడీపీ అనేక విమర్శలు చేస్తుంటే, మర్రి రాజశేఖర్ గొంతు వినిపించలేదని” ఆమె గుర్తు చేశారు. “ఇప్పుడే విమర్శలు చేయడం సరికాదు. ఒకవేళ ఆయన ఎమ్మెల్సీ రాజీనామా ఆమోదం పొందితే, ఆ సీటు టీడీపీ ఖాతాలోకే వెళ్తుంది. విమర్శించే ముందు ఆయన తనను తాను సమీక్షించుకోవాలి” అని విడదల రజిని సూచించారు.





