ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలుగు చిత్రసీమపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “సినీ సంఘాలకు ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా సీఎంను మర్యాదపూర్వకంగా కలిసినవారు ఎవరు?” అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై నిర్మాత బన్నీ వాసు ఎక్స్ వేదికగా స్పందిస్తూ, “సినిమా రాజకీయాలు నీచంగా, లోతుగా ఉంటాయి. ఈ గొడవల్లో పరిశ్రమ నలిగిపోతోంది. డిప్యూటీ సీఎంను ఇరిటేట్ చేస్తే, మన ఐక్యత ఏంటో ప్రశ్నించుకోవాలి” అని ట్వీట్ చేశారు.
“కామన్ సెన్స్తో ఆలోచించి ఉంటే ఈ సమస్యలు వచ్చేవి కాదు!” – నిర్మాత నాగవంశీ.
నిర్మాత నాగవంశీ కూడా, “పెద్ద సమస్యలు పరిష్కరించాల్సిన సమయంలో అనవసర వివాదాలు సృష్టించారు. ఇవి ఇప్పుడు పెద్దవయ్యాయి” అని అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ తన సినిమా ‘హరిహర వీరమల్లు’ విడుదల సమయంలో థియేటర్ల బంద్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం సినీ పరిశ్రమను అవమానించినా, కూటమి ప్రభుత్వం అభివృద్ధి కోసం ప్రయత్నిస్తుంటే, సినీ ప్రముఖుల నుంచి సహకారం లేకపోవడంపై పవన్ అసహనం చెందారు. ఈ వివాదం టాలీవుడ్లో ఐక్యత, రాజకీయ జోక్యంపై మరింత చర్చకు దారితీసింది





