- లండన్ వెళ్లిన మంచు లక్ష్మికి ఫ్యాన్స్ నుంచి మెసేజ్ల వెల్లువ
- “మేము సేఫ్గా ల్యాండ్ అయ్యాం… వార్త విని షాక్కు గురయ్యాను” అంటూ వీడియో విడుదల
గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లే ఎయిరిండియా విమానం జూన్ 12న కుప్పకూలి మంటల్లో దగ్ధమైన ఘటనపై తీవ్ర విషాదం నెలకొంది. అయితే అదే రోజు మంచు లక్ష్మి తన కుమార్తెతో కలిసి ఎయిరిండియా ఫ్లైట్లో లండన్ వెళ్లారు. దీంతో ఆమెకు ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఉత్కంఠతో అభిమానులు పెద్ద ఎత్తున మెసేజ్లు, కాల్స్ చేశారు. దీనిపై మంచు లక్ష్మి స్వయంగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘‘మేము ముంబయి నుంచి లండన్కు ప్రయాణించాం. సేఫ్గా చేరాం. దిగిన తర్వాత ఈ వార్త విని షాక్ అయ్యాం. ఎంతోమంది అమాయకులు మృతి చెందడం బాధాకరం. విద్యార్థులు కూడా మృతిచెందారని విని గుండె బాధించింది. జీవితంలో ఏం జరుగుతుందో చెప్పలేం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’’ అని ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ మీడియాలో వచ్చిన తాజా వివరాల ప్రకారం, ఈ విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు 274 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. మృతుల్లో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా, మిగతా వారు నివాస సముదాయంలోని ప్రజలుగా గుర్తించారు. ఇది విమానయాన చరిత్రలో ఘోరమైన ప్రమాదాల్లో ఒకటిగా భావిస్తున్నారు.





