- ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్ దద్దరిల్లుతోందని, నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని విద్యార్థుల వాపో
- భారత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, తమను స్వదేశానికి రప్పించాలని విజ్ఞప్తి
ఇజ్రాయెల్ వేసిన వైమానిక దాడులతో ఇరాన్ అట్టుడుకుతోంది. ముఖ్యంగా టెహ్రాన్లోని కొన్ని ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు, సైరన్ల మోగింపు నిత్యకృత్యం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ‘‘శుక్రవారం తెల్లవారుజామున బాంబు శబ్దంతో ఒక్కసారిగా లేచా. వెంటనే బేస్మెంట్కి పరుగులు తీశాం. అప్పటి నుంచి మాకు నిద్ర అనే మాట లేదు. పేలుళ్లు జరుగుతున్న ప్రాంతం మేం ఉన్న చోటునుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది’’ అంటూ 22 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థి ఇంతిసాల్ మొహిదీన్ చెప్పాడు. అతడు టెహ్రాన్లోని షాహిద్ యూనివర్సిటీలో చదువుతున్నాడని, తనతో పాటు దాదాపు 350 మంది భారతీయులు ఉన్నారని తెలిపాడు. మేం దేశానికి తిరిగి రావాలనుకుంటున్నాం. ఇంకా పరిస్థితి చెడిపోకముందే తరలించాలని కోరుతున్నాం’’ అని విన్నవించాడు.
భారత ప్రభుత్వం స్పందించింది
విద్యార్థుల ఆందోళనలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ‘‘టెహ్రాన్లో భారత ఎంబసీ పరిస్థితిని సమీక్షిస్తోంది. అక్కడ ఉన్న విద్యార్థుల కోసం చర్యలు తీసుకుంటోంది. కొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. మిగతా వారి విషయమై ఎంబసీ అధికారులు, కమ్యూనిటీ నేతలతో కలిసి చర్యలు తీసుకుంటున్నారు’’ అని వెల్లడించింది. అవసరమైతే దేశానికి తరలించే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపింది. ఇప్పటికే ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరిగినట్టు తెలిపింది. గగనతలం మూసివేయబడిన నేపథ్యంలో భూసరిహద్దుల మీదుగా భారత విద్యార్థులను తరలించే అవకాశం ఉందని ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది.





