- మమ్ముట్టి ఆరోగ్యం విషయంలో పుకార్లకు ఫుల్స్టాప్
- ‘‘ఇప్పుడే ఆయనతో ఫోన్లో మాట్లాడా.. క్షేమంగా ఉన్నారు’’: బ్రిట్టాస్
- ‘‘రంజాన్ బ్రేక్ తీసుకున్నప్పుడే ఆరోగ్య రూమర్స్ వచ్చాయి’’: మమ్ముట్టి టీమ్
‘‘మమ్ముట్టి ఆరోగ్యం బాగోలేదంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత?’’ అనే సందేహం కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో ఆయన స్నేహితుడు, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ స్పందించారు. మమ్ముట్టికి తేలికపాటి ఆరోగ్య సమస్య ఉందని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ‘‘ఇప్పుడే ఆయనతో ఫోన్లో మాట్లాడాను. క్షేమంగా ఉన్నారు. ఆందోళన అవసరం లేదు’’ అని వివరించారు. ఈ పుకార్లపై మమ్ముట్టి టీమ్ కూడా స్పష్టత ఇచ్చింది. ‘‘రంజాన్ కారణంగా మమ్ముట్టి కొన్ని రోజులు షూటింగ్కు బ్రేక్ తీసుకున్నారు. అదే సమయంలో వేకేషన్కు వెళ్లారు. ఇది నెగటివ్ ప్రచారానికి కారణమైంది. ఆయన త్వరలో మోహన్లాల్తో కలిసి మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో సినిమా ప్రారంభించనున్నారు’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మమ్ముట్టి ఆరోగ్యం కోసం శబరిమలలో మోహన్లాల్ ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆయన వ్యక్తిగత సహాయకులు వెల్లడించారు. ‘‘ఇలాంటి చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికీ వస్తాయి. ఆందోళన అవసరం లేదు’’ అని మోహన్లాల్ తెలిపారు.





