- కోట శ్రీనివాసరావు మృతి పట్ల నటుడు బాబూమోహన్ తీవ్ర దిగ్భ్రాంతి.
- “సొంత అన్నదమ్ముల్లా కలిసి ఉండేవాళ్లం” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న బాబూమోహన్.
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం సినీ లోకాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. కోట భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నటుడు బాబూమోహన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం హైదరాబాద్లో కోట శ్రీనివాసరావు భౌతికకాయానికి నివాళులర్పించిన బాబూమోహన్, అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. “ఈ రోజు చాలా దురదృష్టకరమైన రోజు” అంటూ బాబూమోహన్ మాట్లాడారు. “రెండు రాష్ట్రాల ప్రజలకంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు ఆయన. మేమిద్దరం సినిమాల్లోనే కాదు, బయట కూడా చాలా సరదాగా ఉండేవాళ్లం. రెండు రోజుల కిందటే ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పా. నేనొచ్చేసరికి ఆయన లేడు. నా కోటన్న వెళ్లిపోయాడు” అని బాబూమోహన్ కన్నీళ్లతో చెప్పారు.
కోటతో బాబూమోహన్ అనుబంధం
కోట శ్రీనివాసరావుతో తన అనుబంధాన్ని బాబూమోహన్ గుర్తు చేసుకున్నారు. “ఇంటికొస్తే ఎంతో సంతోషంగా, ఆప్యాయంగా మాట్లాడేవాడు. ఆయనకు అన్నదమ్ములున్నా, నన్నే తన సొంత తమ్ముడిగా భావించేవాడు. షూటింగ్కు సమయం తక్కువగా ఉన్నప్పుడు అన్నం కలిపి పెట్టేవాడు. ఏ ఊరు షూటింగ్కు వెళ్లినా, పక్కపక్క గదుల్లోనే ఉండేవాళ్లం. ఇలా మా జీవితంలో ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి” అంటూ బాబూమోహన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కోట శ్రీనివాసరావుతో బాబూమోహన్కు ఉన్న ప్రత్యేక అనుబంధం ఈ మాటల్లో స్పష్టంగా కనిపించింది.





