- కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష జులై 16న జరగాల్సి ఉండగా వాయిదా పడింది.
- భారత ప్రభుత్వం, కుటుంబం “బ్లడ్ మనీ” కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
యెమెన్లో మరణశిక్ష పడిన కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిని వాయిదా వేసినట్లు తెలిసింది. జులై 16న ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా, భారత ప్రభుత్వం, నిమిషా కుటుంబం చేసిన ప్రయత్నాల వల్ల దీనిని వాయిదా వేశారు. ఈ కేసు మొదలైనప్పటి నుంచి భారత ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుంది. నిమిషా ప్రియ కుటుంబం, ఆమెకు మద్దతు ఇచ్చేవాళ్లు మృతి చెందిన తలాల్ అబ్దుల్ మెహదీ కుటుంబంతో “బ్లడ్ మనీ” (రక్తపు సొమ్ము) ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. షరియా చట్టం ప్రకారం, ఇది కుదిరితే నిమిషా ప్రియ క్షమాపణ పొందే అవకాశం ఉంటుంది. ఈ కేసులో చాలా సున్నితమైన అంశాలు ఉన్నప్పటికీ, భారత అధికారులు యెమెన్లోని స్థానిక జైలు అధికారులతో, ప్రాసిక్యూటర్ కార్యాలయంతో నిరంతరం టచ్లో ఉన్నారు. ఇదే ఉరిశిక్ష వాయిదా పడటానికి సహాయపడింది అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కేంద్రం సుప్రీంకోర్టుకు ఏం చెప్పింది?
ఈ విషయం బయటికి వచ్చిన ఒక రోజు ముందు, నిమిషాను కాపాడటానికి తాము చేయగలిగినదంతా చేశామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. “ప్రభుత్వం చేయగలిగింది పెద్దగా లేదు… యెమెన్ సున్నితత్వాన్ని చూస్తే… వారికి దౌత్య గుర్తింపు లేదు… భారత ప్రభుత్వం వెళ్లగల ఒక పరిమితి ఉంది. మేము అక్కడి వరకు వెళ్ళాం. యెమెన్ ప్రపంచంలోని ఇతర ప్రాంతాల లాంటిది కాదు. మేము పరిస్థితిని మరింత క్లిష్టతరం చేయదలుచుకోలేదు, ప్రైవేట్ స్థాయిలో ప్రయత్నిస్తున్నాం” అని కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి చెప్పారు. యెమెన్ అధికారులతో చర్చలు జరిపిన సంధానకర్త భాస్కరన్, “యెమెన్ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు, విదేశాంగ మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు” అని తెలిపారు. ఆమెను కాపాడటానికి యెమెన్లో “వివిధ స్థాయిలలో” చర్చలు జరుగుతున్నాయని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. “కమ్యూనిటీ నాయకులు, భారత మిషన్కు సంబంధించిన ఇద్దరు యెమెన్ పౌరులు, సంధానకర్త శామ్యూల్ జెరోమ్ భాస్కరన్ ఈ చర్చల్లో పాల్గొన్నారు” అని ఒక వర్గం చెప్పింది. నిమిషా ప్రియ తల్లి ప్రేమ కుమారి గత సంవత్సరం నుంచి యెమెన్లోనే ఉన్నారు. “గత నెలలో నేను జైలులో నా కూతురిని కలిశాను. ఆమె నిశ్శబ్దంగా బాధపడుతుంది” అని సోమవారం ఆమె చెప్పారు.
కేరళ నుంచి అఖిల భారత సున్నీ జమియ్యతుల్ ఉలమా ప్రధాన కార్యదర్శి కాంతపురం ఎ.పి. అబూబక్కర్ ముస్లియార్ కూడా నిమిషా విడుదల కోసం ప్రయత్నాలు చేశారు. తలాల్ కుటుంబాన్ని, స్థానిక నాయకత్వాన్ని చర్చించి, మహిళను క్షమించమని కోరాలని ఆయన యెమెన్లోని ఒక ప్రముఖ సూఫీ పండితుడిని కోరారు.
అసలు ఏం జరిగింది?
కేరళలోని పాలక్కాడ్కు చెందిన నిమిషా ప్రియ, 2017లో తలాల్ అబ్దుల్ మెహదీ హత్య కేసులో దోషిగా తేలింది. యెమెన్ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఆమెను అరెస్ట్ చేశారు. 2018లో మరణశిక్ష విధించారు. నర్సుగా అర్హత సాధించిన తర్వాత ప్రియ 2008లో యెమెన్కు వెళ్లింది. 2011లో ఆమె కేరళలో టోమీ థామస్ను పెళ్లి చేసుకుంది. ఇద్దరూ తమ సొంత క్లినిక్ను ప్రారంభించాలనుకున్నారు. అయితే యెమెన్ చట్టం ప్రకారం, దీనికి స్థానిక భాగస్వామి భాగస్వామ్యం అవసరం. ప్రియ పని చేస్తున్న క్లినిక్కు తరచుగా వచ్చే తలాల్ అబ్దుల్ మెహదీని దంపతులు సహాయం కోసం సంప్రదించారు. క్లినిక్ మొదలయ్యాక, మెహదీ ఆమెకు ఆదాయం ఇవ్వడానికి నిరాకరించాడట. అలాగే, తన భర్త కేరళలో ఉన్నప్పుడు, ఆమెను తన భార్యగా చూపిస్తూ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ప్రియ కుటుంబం ప్రకారం, మెహదీ ఆమె ప్రయాణ పత్రాలను, పాస్పోర్ట్ను తీసుకున్నాడు కాబట్టి ఆమె వెళ్లలేకపోయింది.
ఒక రోజు, ప్రియ తన పత్రాలను తిరిగి తీసుకోవడానికి సహోద్యోగి నర్సు హన్నన్ సహాయంతో మెహదీకి మత్తుమందు ఇవ్వడానికి ప్రయత్నించింది. కానీ, మోతాదు ఎక్కువై అతను చనిపోయాడు. భయపడి, ఇద్దరూ మెహదీ శరీరాన్ని ముక్కలుగా కోసి వాటర్ ట్యాంక్లో పడేశారు. తర్వాత ఇద్దరినీ అరెస్ట్ చేశారు. యెమెన్లోని ట్రయల్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. దేశ సుప్రీంకోర్టు కూడా దీనిని సమర్థించింది. గత సంవత్సరం, యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్-అలిమి 38 ఏళ్ల నిమిషా ప్రియ మరణశిక్షను ఆమోదించారు. ఈ ఆర్డర్ ఈ ఏడాది జనవరి నుంచి ప్రాసిక్యూటర్ వద్ద ఉంది.





