- ఎదురుచూస్తున్న వర్షాలు ఎట్టకేలకు వచ్చాయి. శుక్రవారం చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
- రానున్న మూడు రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
- కొన్ని జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. శుక్రవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రానున్న మూడు రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు సైతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బికనీర్, సికార్, వాయువ్య మధ్యప్రదేశ్ నుంచి నైరుతి ఉత్తరప్రదేశ్ వరకు కొనసాగుతున్న వాయుగుండం క్రమంగా తూర్పు ఆగ్నేయ దిశలో కదిలి ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించనుంది. అదే విధంగా, ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీనికి సమాంతరంగా ఉపరితల ద్రోణి కూడా సాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
మధ్య తెలంగాణలో భారీ వర్షం.. ఆరెంజ్ అలర్ట్!
శుక్రవారం రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా మధ్య తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 50 చోట్ల 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కురిసింది. రాష్ట్రంలో వరుసగా మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. శనివారం ఉదయం వరకు రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ ఇచ్చింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.





