- న్యూయార్క్లో జరిగిన బస్సు ప్రమాదంలో ఐదుగురు పర్యాటకులు మృతి
- మరణించినవారిలో భారతీయులు, చైనీయులు, ఫిలిప్పీన్స్ పౌరులు
- బస్సు డ్రైవర్ దృష్టి మరలడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు
పర్యాటకులను తీసుకువెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన న్యూయార్క్ హైవేపై చోటు చేసుకుంది. నయాగరా జలపాతాలను చూసి తిరిగి న్యూయార్క్ నగరానికి వస్తుండగా, బఫెలోకు 40 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. మరణించినవారిలో భారతీయులు, చైనీయులు, ఫిలిప్పీన్స్ దేశస్తులు ఉన్నారు.
డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
న్యూయార్క్ స్టేట్ పోలీసు కమాండర్ మేజర్ ఆండ్రీ రే ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్ దృష్టి మరలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగిందన్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 54 మంది ప్రయాణికులు ఉన్నారు. మరణించినవారిలో పిల్లలు ఎవరూ లేకపోవడం ఊరట కలిగించే విషయం.
విచారణ కొనసాగుతోంది..
పోలీసుల విచారణలో, బస్సులో సాంకేతిక లోపాలు ఏవీ లేవని, డ్రైవర్ మత్తులో లేడని తేలింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతానికి ఎవరిపైనా ఎలాంటి కేసు నమోదు చేయలేదు. బస్సు డ్రైవర్ సురక్షితంగా ఉన్నారని, ప్రమాదం ఎందుకు జరిగిందో తెలుసుకునేందుకు అతడితో మాట్లాడుతున్నామని పోలీసులు తెలిపారు.
సహాయక చర్యలు..
ప్రమాద స్థలంలో సహాయక చర్యల కోసం వెంటనే బృందాలను పంపించారు. బాధితులతో మాట్లాడేందుకు అనువాదకులను కూడా పంపించారు. సహాయక చర్యల్లో ఎనిమిది హెలికాప్టర్లు పాల్గొన్నాయని మెర్సీ ఫ్లైట్ అధ్యక్షుడు మార్గరెట్ ఫెరెంటినో తెలిపారు. ఈ ఘటనపై న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్, సెనేటర్ చక్ షుమెర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.





