- బిహార్ లోని మౌంటైన్ మ్యాన్ దశరథ్ మాంఝీ కుటుంబానికి ఇల్లు నిర్మాణం
- ఇంటికి రాహుల్ గాంధీ నిధులు
- ఇల్లు పూర్తయిన తర్వాత.. మాంఝీ కుమారుడికి తాళాలు అందజేత
బిహార్కు చెందిన ‘మౌంటైన్ మ్యాన్’ దశరథ్ మాంఝీ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇంటిని నిర్మించి ఇచ్చారు. గయలో మాంఝీ కుమారుడు భగీరథ్ మాంఝీ ఉంటున్న ఇంట్లో ఇటీవల రాహుల్ గాంధీ పర్యటించారు. అయితే, ఆయన ఈ ఇంటిని ఎలా నిర్మించారు అనేది ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు.
గోప్యంగా ఇల్లు..
దశరథ్ మాంఝీ కొడుకు భగీరథ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తమకు ఇల్లు కట్టించి ఇస్తున్నారని తాము ముందు అనుకోలేదని తెలిపారు. రాహుల్ గాంధీ గయలో పర్యటిస్తున్నప్పుడు తమ కుటుంబాన్ని కలుసుకున్నారని, అప్పుడే తమ తండ్రి సాధించిన విజయాలను అభినందించారని చెప్పారు. ఆ తర్వాత ఒక నెలలోనే తమ ఇంటికి నిర్మాణ పనులు మొదలయ్యాయని, తమకు చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. పక్కాగా నిర్మించిన తమ ఇంటిలో 5 గదులు, ఒక బాత్రూమ్, వంటగది ఉన్నాయని, అన్ని గదుల్లో ఫ్యాన్లతో పాటు, తాగునీటి సమస్య కూడా పరిష్కారమైందని భగీరథ్ మాంఝీ వివరించారు.
మౌంటైన్ మ్యాన్ అంటే..
దశరథ్ మాంఝీ బిహార్లోని గయకు చెందిన ఒక సాధారణ కూలీ. ఆయన భార్య సరైన సమయంలో వైద్యం అందక మరణించారు. దాంతో ఆగ్రహించిన మాంఝీ.. తన భార్య మృతికి కారణమైన కొండను తన చేతులతోనే, ఒక సుత్తి, ఉలి సహాయంతో 22 ఏళ్ల పాటు శ్రమించి.. రహదారిని నిర్మించారు. ఫలితంగా 55 కి.మీ ఉన్న దూరాన్ని 15 కి.మీకి తగ్గించగలిగారు. అందుకే, ఆయన్ని ‘మౌంటైన్ మ్యాన్’ అని పిలుస్తారు. ఆయనకు మరణానంతరం పద్మశ్రీ అవార్డు కూడా దక్కింది. రాహుల్ గాంధీ మాంఝీ మరణానంతరం ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.
గతంలో కూడా ఇలాంటి సాయం..
రాహుల్ గాంధీ ఇలా సాయం చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన పలువురు సామాన్యులకు సాయం చేశారు. ఓసారి రాయ్బరేలీలో ఒక బార్బర్కు రెండు కుర్చీలు, షాంపూ కుర్చీ, ఇన్వర్టర్ను బహుమతిగా ఇచ్చారు. అలాగే, ఒక మోచీకి చెప్పులు కుట్టే యంత్రాన్ని కూడా పంపించారు.





