వినాయక చవితి వీకెండ్లో రిలీజైన సినిమాల్లో ‘త్రిభాణధారి బార్బరిక్’ ఒకటి. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా, జనాలు పెద్దగా థియేటర్లకు రాకపోవడంతో దర్శకుడు మోహన్ శ్రీవత్స తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తన బాధను ఒక వీడియోలో పంచుకున్నారు.
తాజాగా బార్బరిక్ సినిమా ఆడుతున్న థియేటర్కి వెళ్తే లోపల పది మంది మాత్రమే ఉన్నారని మోహన్ శ్రీవత్స ఆవేదన వ్యక్తం చేశారు. నేనెవరో చెప్పకుండా సినిమా ఎలా ఉందని అడిగితే అందరూ బాగుందని చెప్పారని అన్నారు. శనివారం సాయంత్రం తన భార్యతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు, మనసు బాగోలేక అరగంటలోనే ఇంటికి తిరిగి వచ్చేశానని ఆయన అన్నారు. తాను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటానో అని భయపడి తన భార్య కూడా తనతో పాటు వచ్చిందని భావోద్వేగంగా చెప్పారు.
“మలయాళంలోనే సినిమాలు తీస్తా”
“ఇంత మంచి సినిమా తీస్తే జనాలు ఎందుకు రావడం లేదు భయ్యా? నాకు అసలు ఇది అర్థం కావడం లేదు. మలయాళం నుంచి సినిమాలు వస్తే, అక్కడ మంచి కంటెంట్ వస్తే థియేటర్లకు వెళ్తున్నారు కదా. ఇక మలయాళంలోనే సినిమాలు తీస్తా, అక్కడ హిట్ కొట్టి నిరూపించుకుంటా” అని మోహన్ శ్రీవత్స సవాల్ విసిరారు. సినిమా నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటానని గతంలో చెప్పిన దాన్ని గుర్తు చేసుకుంటూ, తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
ప్రేక్షకుల మైండ్సెట్ మారింది
త్రిభాణధారి బార్బరిక్లో సత్యరాజ్, ఉదయభాను లాంటి వాళ్ళు ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమాకు మంచి టాక్ వచ్చినా, స్టార్ హీరోలు లేకపోవడంతో జనాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం ప్రేక్షకులు.. స్టార్ హీరోల చిత్రాలైతేనే థియేటర్లలోకి వచ్చి చూస్తున్నారు. చిన్న చిత్రాలైతే ఓటీటీలో చూసుకోవచ్చు అనే మైండ్సెట్తో ఉంటున్నారు. ఈ కారణంగానే చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతున్నాయి.





