ఉత్తర భారతదేశంలో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, కొండచరియల పతనాలకు ప్రధాన కారణం అక్రమంగా చెట్లను నరికివేయడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పంజాబ్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో సంభవిస్తున్న ఈ ప్రకృతి వైపరీత్యాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
“ఉత్తర భారతంలో జరుగుతున్న విపత్తులను అందరం గమనిస్తున్నాం. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో అక్రమంగా చెట్లు నరుకుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. వరద నీటిలో భారీగా కొట్టుకుపోతున్న చెట్ల దుంగల దృశ్యాలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశాలు
ఈ పర్యావరణ విపత్తుపై దాఖలైన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సమస్య అత్యంత తీవ్రమైనదని పేర్కొన్న ధర్మాసనం, దీనిపై సమగ్ర నివేదికను సమర్పించాలని కేంద్రంతో పాటు హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలను ఆదేశించింది. వరద నీటిలో చెట్ల దుంగలు ఎందుకు ఇంత స్థాయిలో కొట్టుకుపోతున్నాయో తెలుసుకోవాలని, దీనిపై సంబంధిత అధికారులను సంప్రదించాలని కూడా సూచించింది. ఈ కేసుపై తదుపరి విచారణ రెండు వారాల తర్వాత జరగనుంది.
ఉత్తరాదిలో పెరుగుతున్న నష్టం
ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు, నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్లో పలుమార్లు మేఘవిస్ఫోటనాలు సంభవించి ప్రాణనష్టం సంభవించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు మూసుకుపోయాయి.
పంజాబ్లో వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించగా, యమునా నది ఉప్పొంగడం వల్ల దిల్లీకి కూడా వరద ముప్పు పెరుగుతోంది. వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలు కూడా నీట మునిగిపోవడం అక్కడి పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.





