- ‘ఉదయం 6 గంటలకు షూటింగ్ పెట్టుకుంటా.. 4.30కల్లా ఇంటికి చేరుతా’
- పిల్లలు తమ తల్లిని ‘పని చేసే వ్యక్తి’గా కూడా గుర్తించడం, మహిళలను గౌరవించడం నేర్పించాలి!
నటి జెనీలియా డిసౌజా దేశ్ముఖ్ తన పని, ఇంటి బాధ్యతలను సమానంగా చూడడం గురించి మాట్లాడారు. మహిళలు తప్పకుండా పని చేయాలని, స్వతంత్రంగా ఉండాలని.. అలాంటి వైఖరిని నేను ప్రోత్సహిస్తానని ఆమె చెప్పారు. “నేను గతంలోలా ఏడాది పొడవునా పని చేయలేను. ఎందుకంటే నా పిల్లలకు నేను అందుబాటులో ఉండడం ముఖ్యం. అయినప్పటికీ, నా పిల్లల కోసం నేను అందుబాటులో ఉంటూనే పని చేయాలని కోరుకుంటున్నా” అని జెనీలియా తెలిపారు. ఆమెకు నటుడు రితేష్ దేశ్ముఖ్తో ఇద్దరు కుమారులు ఉన్నారు.

తన పిల్లలు ఇంటికి వచ్చే సమయానికి తాను ఇంట్లో ఉండాలని ఆమె చెప్పారు. “నేను ఉదయం 6 గంటలకు షూటింగ్ ప్లాన్ చేసుకుంటాను. దాని వల్ల నా పిల్లలు 4.30 గంటలకు ఇంటికి వచ్చే సమయానికి నేను తిరిగి ఇంటికి చేరుకోగలను. దానికి నేను ఒక దారి వెతుక్కున్నాను” అని 37 ఏళ్ల జెనీలియా అన్నారు.
పిల్లలకు తల్లి విలువ తెలీయాలి
పిల్లలు కూడా తల్లిదండ్రులు చేసే పనిని గౌరవించాలని జెనీలియా అన్నారు. “నా పిల్లలు నన్ను ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తిగా మాత్రమే కాకుండా, పని చేసే వ్యక్తిగా కూడా చూడాలి. అమ్మగా నేను ఎంత క్రమశిక్షణతో ఉంటానో, నా పనిలోనూ అంతే క్రమశిక్షణతో ఉంటానని వారికి తెలీయాలి” అని ఆమె వ్యాఖ్యానించారు. “వారు మహిళలను గౌరవించాలంటే, దాన్ని ఇంట్లో చూడాలి. అప్పుడే వారు మహిళలను గౌరవిస్తారు” అని జెనీలియా స్పష్టం చేశారు. తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తూ కూడా పిల్లలకు సమయం కేటాయించడం, వారి ముందు మంచి రోల్ మోడల్గా ఉండడం ఎంత ముఖ్యమో ఆమె నొక్కి చెప్పారు.





