- సాక్షి టీవీతో పాటు నాలుగు చానెళ్లను అడ్డుకున్న ఏపీ ప్రభుత్వం
- ‘ప్రశ్నించే మీడియా అంటే చంద్రబాబుకు భయమా?’ అని కన్నబాబు విమర్శ
అమరావతి, ఫిబ్రవరి 26: ఏపీ అసెంబ్లీ సమావేశాలను కవరేజీకి వెళ్లిన కొన్ని టీవీ చానెళ్లను అనుమతించకపోవడంపై వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించే మీడియాను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు.
‘మీడియా గొంతు నొక్కే ప్రయత్నం’
ఏపీ అసెంబ్లీలోని ముఖ్యమైన పరిణామాలను ప్రజలకు తెలియకుండా చేయాలనే ఉద్దేశంతోనే మీడియాపై ఆంక్షలు విధించారని కన్నబాబు ఆరోపించారు. ‘‘చంద్రబాబు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పాటించకుండా, తన కుమారుడు లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును హరిస్తున్నారు’’ అని విమర్శించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలను కవరేజీ చేసే హక్కు అన్ని చానెళ్లకూ ఉండాలని కన్నబాబు డిమాండ్ చేశారు. ‘‘ఏ అసెంబ్లీ చరిత్రలో కూడా ఇలాంటి మీడియా నిషేధం జరగలేదు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మీడియాపై ఆంక్షలు విధించడం అన్యాయమని’’ ఆయన మండిపడ్డారు.






