ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా (BJP) భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో భాజపా అధికారంలోకి రానున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పందించారు. ఢిల్లీ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని, డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడబోతుందని తెలిపారు.
తెలంగాణ, కర్ణాటకలోనూ భాజపా గెలుస్తుంది
‘‘దిల్లీ ఓటర్లకు శుభాకాంక్షలు. ప్రజలు భాజపాకు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా భాజపా అనుకూల పరిస్థితి నెలకొంది. కర్ణాటక, తెలంగాణలోనూ మా పార్టీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భారాస తరహాలోనే పాలన సాగిస్తోంది. హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోంది. బీసీలను అవమానిస్తూ అన్యాయం చేస్తోంది. దీంతో కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది’’ అని కిషన్ రెడ్డి అన్నారు.





