- తొమ్మిది నెలల్లోనే కూటమి ప్రభుత్వం స్కామ్ల కోసం సంపదను తగలబెడుతోందని ఆరోపణ
- టీడీపీ హయాంలో ఇసుక, మద్యం దోపిడీ.. తమ పాలనలో పారదర్శక వ్యవస్థ – జగన్
నవరత్నాల ద్వారా ప్రజలకు మేలు చేయడం, ఆర్థిక క్రమశిక్షణతో పాలన సాగించడం తన ప్రభుత్వ విధానమని, కానీ ఇప్పటి కూటమి ప్రభుత్వం సంపదను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే “తన, తన అనుచరుల జేబులు నింపుకోవడమే” అని విమర్శించారు. ఈ ప్రభుత్వం స్కామ్లలో మాత్రమే దూసుకుపోతోందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దారుణంగా తయారు చేసిందని ఆరోపించారు.
“ఆర్థిక విధ్వంసకారుడు చంద్రబాబే”
తొమ్మిది నెలల్లోనే రూ.1.45 లక్షల కోట్ల అప్పులతో ఆల్టైమ్ రికార్డు సృష్టించిన చంద్రబాబు నిజమైన ఆర్థిక విధ్వంసకారుడా? లేక కోవిడ్ కాలంలోనూ వృద్ధి రేటును పెంచిన తామే విధ్వంసకారులమా? అని జగన్ ప్రశ్నించారు. తమ పాలనలో 17 మెడికల్ కాలేజీలు, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు నిర్మించినట్లు గుర్తు చేశారు. కాంట్రాక్టర్లకు కమీషన్లు వసూలు చేసేందుకు తిరిగి “మొబిలైజేషన్ అడ్వాన్స్” విధానం తీసుకువచ్చిన చంద్రబాబు నిజమైన ఆర్థిక విధ్వంసకారుడు అని ధ్వజమెత్తారు.





