గాజులదిన్నె ప్రాజెక్టు సమీపంలో జరిగిన ప్రేమజంటపై దాడి ఘటనలో తాజా వివరాలు వెలుగులోకి వచ్చాయి. యువకుడిపై దాడి వెనుక యువతి ఉండడమే విచారకరమైన విషయం. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన అరవింద్ డిస్టెన్స్ డిగ్రీ చదువుతున్నాడు. ఇంటర్ చదివే సమయంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మధ్య ప్రేమ పెళ్లి వరకు చేరుకుంది, కానీ అమ్మాయి కుటుంబ సభ్యుల నుండి ఎదురైన ఒత్తిడితో ఆ ప్రేమలో బ్రేక్ పడింది. ప్రస్తుతం అమ్మాయి ఓ కళాశాలలో బీటెక్ చదువుతోంది, అక్కడే మరో అబ్బాయితో ఆమె ప్రేమలో పడింది.
అయితే, ఆమె రెండు ప్రేమాయణాల్ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది. కానీ, ఇటీవల ఆమె మొదటి ప్రియుడి గురించి రెండో ప్రియుడికి తెలిసింది. అప్పుడు యువతి తప్పును దాచేందుకు నేను ప్రేమించడం లేదు.. తనే నా వెంట పడుతున్నాడని చెప్పింది. అంతే కాదు.. రెండో ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఇద్దరూ కలిసి ఒక దాడి చేసేందుకు కుట్ర పన్నారు. రెండు రోజుల ముందు గాజులదిన్నె ప్రాజెక్టు వద్దకు వచ్చి రెక్కీ నిర్వహించిన యువతి, మంగళవారం అరవింద్ను ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లింది. ఆమె ఫోన్ ద్వారా వర్తమానాన్ని రెండవ ప్రియుడికి తెలియ చేసింది. అతడు తన స్నేహితులతో కలిసి వేటకొడవళ్లతో అక్కడ చేరుకుని అరవింద్పై దాడి చేశారు. అరవింద్ కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు వచ్చి అతన్ని కాపాడారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. ఈ దాడి వెనుక యువతిదే పక్కా ప్లాన్ ఉందని, ఇది విచారించిన తర్వాత పోలీసులు వెల్లడించారు. సీఐ గంగాధర్ మాట్లాడుతూ, ఈ ప్రేమజంటపై దాడి ఘటనను విచారిస్తున్నామని, గురువారం మీడియాకు పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.





