రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్టు తెలిపారు.
విజయవాడలో ‘మంటాడ టు మ్యాన్హ్యాటన్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆరోగ్య భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. కలుషిత ఆహారం అనారోగ్యానికి కారణమని, ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని వివరించారు. అందుకే రానున్న నాలుగేళ్లలో 50 లక్షల ఎకరాలకు ప్రకృతి వ్యవసాయం విస్తరిస్తామని స్పష్టం చేశారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడు సుదీర్ఘంగా క్యాన్సర్ రోగులకు సేవలందించిన గొప్ప నిపుణుడని, ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. గతంలో ఎన్టీఆర్ ప్రోత్సాహంతో హైదరాబాద్లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభమైనట్టు గుర్తు చేశారు. ఇప్పుడు అమరావతిలోనూ క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.





