ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో దాగివున్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. “యాక్టివ్ ఆంధ్ర” పేరుతో విద్యాశాఖ తీసుకొచ్చిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించనున్నారు.
విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు “యాక్టివ్ ఆంధ్ర” కార్యక్రమం… మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు పాఠశాలలో ప్రయోగాత్మకంగా అమలు.
ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు పాఠశాలలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. వేసవి సెలవుల వరకు ఈ ప్రయోగాత్మక కార్యక్రమం కొనసాగనుంది. ఆ తర్వాత వచ్చే విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో “యాక్టివ్ ఆంధ్ర” కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ప్రతిరోజూ కనీసం ఒక గంట పాటు క్రీడల్లో పాల్గొనేలా చూడనున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో శారీరక, మానసిక వికాసం జరగడంతోపాటు, జయాపజయాలను సమానంగా స్వీకరించే స్ఫూర్తి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. “యాక్టివ్ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను వయసుల వారీగా విడదీసి, వారికి నచ్చిన క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్ వంటి క్రీడల కోసం మల్టీ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. రన్నింగ్, అథ్లెటిక్స్ కోసం ప్రత్యేకంగా ట్రాక్లు నిర్మిస్తారు. ఇందుకోసం వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి నాలుగు, ఐదు పాఠశాలలకు ఒక స్పోర్ట్స్ ఎక్స్లెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అక్కడ ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.





