ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరిగిన బహిరంగసభలో ప్రధాని మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర-2047 సాకారం కోసం కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే జోన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని మోదీ వివరించారు. ఈ జోన్ ద్వారా వ్యవసాయం, వ్యాపారం, పర్యాటక రంగాలకు గణనీయమైన ప్రోత్సాహం లభించడంతో పాటు, స్థానిక ఆర్థికవ్యవస్థ అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపన
విశాఖపట్నంలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో గ్రీన్ హైడ్రోజన్ హబ్, క్రిస్ సిటీ స్మార్ట్ సిటీ, బల్క్ డ్రగ్ పార్క్, పారిశ్రామిక హబ్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు రాష్ట్రాన్ని తయారీ రంగ హబ్గా మారుస్తాయని, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. ‘‘రాష్ట్రాన్ని ఆధునిక పట్టణీకరణకు మోడల్గా తీర్చిదిద్దుతాం. కృష్ణపట్నంలో క్రిస్ సిటీ నిర్మాణం దానికి దోహదం చేస్తుంది’’ అని మోదీ చెప్పారు. చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కలసి పని చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.






