రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు. ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, చనిపోయిన కోళ్లను సక్రమంగా పూడ్చిపెట్టే విధానంపై కలెక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం పంపిన మార్గదర్శకాలను అనుసరించి, వైరస్ సోకిన ప్రాంతానికి ఒక కిలోమీటరు పరిధిని రెడ్ జోన్గా ప్రకటించి రాకపోకలు, దాణా రవాణాను నియంత్రించాలని సూచించారు. ఒకటి నుంచి తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సీఎస్ ఆదేశించారు.
మానవులకు సోకే ప్రమాదం తక్కువ
బర్డ్ ఫ్లూ సోకిన ఏలూరు జిల్లా బాదంపూడి, పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు, కానూరు, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం ప్రాంతాల్లో చేపట్టిన చర్యలను జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏవియన్ ఇన్ఫ్లూఎంజా వైరస్ మానవులకు సోకినట్లు రికార్డు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా కేవలం నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయని వివరించారు. ఇదే విషయంపై ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కేంద్ర పశుసంవర్ధక శాఖ కమిషనర్ అణిత్ మిత్రా, సోకిన ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటించి ప్రతీ 15 రోజులకు నమూనాలు సేకరించి నివేదికలు పంపించాలని సూచించారు.





