- రియల్ టైమ్ గవర్నెన్స్ కోసం ఉపగ్రహం ప్రతిపాదన
- వాట్సప్ ద్వారా 1000 ప్రభుత్వ సేవలు అందుబాటులోకి
రాష్ట్ర పరిపాలనను మరింత సమర్థంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు సొంతంగా ఉపగ్రహాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అవసరమైతే మూడు ప్రాంతాలకు మూడు ఉపగ్రహాలను ఏర్పాటు చేసి, వాటిని డ్రోన్లు, సీసీటీవీలు, ఐఓటీ పరికరాలతో అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు. మంగళవారం కలెక్టర్ల సదస్సులో ఈ ప్రతిపాదనను ఆయన వెల్లడించారు. రియల్-టైమ్ మానిటరింగ్తో పాటు అక్రమ నిర్మాణాలు, ఇసుక రవాణా వంటి అంశాలను సమర్థంగా నియంత్రించేందుకు ఉపగ్రహాన్ని ఉపయోగించనున్నట్లు వివరించారు.
ప్రభుత్వ సేవలను మరింత వేగంగా ప్రజలకు చేరువ చేసేందుకు వాట్సప్ గవర్నెన్స్ను విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 210 సేవలు అందుబాటులో ఉండగా, త్వరలోనే వాటిని 1000కి పెంచనున్నారు. ఏప్రిల్ నుంచి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలు పొందే విధానంపై శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎం వెల్లడించారు. పరిపాలనలో ఆధునిక సాంకేతికత వినియోగం ద్వారా ఏపీ దేశంలోనే ముందంజలో నిలుస్తుందని చంద్రబాబు తెలిపారు.





