ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసు రూ.4,000 కోట్ల అవినీతితో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించి, పలువురిని విచారిస్తూ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఈ కేసులో విజిల్ బ్లోయర్ (సమాచారం బయటపెట్టినవాడు) మాత్రమేనని, దొరికిన, దొరకని నిందితులు తన పేరును లాగుతున్నారని ట్వీట్లో ఆరోపించారు. లిక్కర్ స్కామ్లో దొంగలను బయటకు తీసేందుకు పూర్తి సహకారం అందిస్తానని పేర్కొన్నారు.
లిక్కర్ స్కామ్లో నా పాత్ర విజిల్ బ్లోయర్ మాత్రమే. దొరికిన, దొరకని దొంగలు నా పేరును లాగుతున్నారు. నేను ఒక్క రూపాయి ముట్టలేదు. దోషుల బట్టలు పూర్తిగా విప్పేందుకు సిట్కు సహకరిస్తా,” అని విజయసాయి రెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (రాజ్ కసిరెడ్డి)ని ఏప్రిల్ 21, 2025 రాత్రి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. విజయవాడకు తీసుకెళ్లిన అనంతరం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు, ఆ తర్వాత ఏప్రిల్ 22 ఉదయం నుంచి మళ్లీ విచారణ కొనసాగించారు. కసిరెడ్డి ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నందున, సేకరించిన ఆధారాలు, ఇతరుల వాంగ్మూలాల ఆధారంగా సిట్ అతడిని తీవ్రంగా ప్రశ్నిస్తోంది. విజయసాయి రెడ్డి గతంలో సిట్ విచారణలో కసిరెడ్డినే స్కామ్కు మూలకారణంగా చెప్పారు, ఇప్పుడు కసిరెడ్డి అరెస్ట్ తర్వాత చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. సిట్ దర్యాప్తు ఈ కేసులో మరిన్ని వివరాలను బయటకు తీసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.





