మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో భాజపా ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) ఒక స్థిరాస్తి దళారిపై చేయిచేసుకోవడం కలకలం రేపుతోంది. మంగళవారం ఏకశిలానగర్లో పర్యటించిన ఆయన, బాధితుల ఫిర్యాదుల ఆధారంగా దళారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల భూములను లాక్కోవడం, మోసపత్రాలతో ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.
‘‘పేదలకు భాజపా అండగా ఉంటుంది’’
ఈటల మాట్లాడుతూ, పేదల కొనుగోలు చేసిన భూములను దళారులు అక్రమంగా కబ్జా చేస్తుండటంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘కొంతమంది అధికారులు, బ్రోకర్లు కలిసి పేదల భూములను లాక్కొంటున్నారు. ఇలాంటి ఘటనలపై కలెక్టర్, పోలీసు కమిషనర్లతో చర్చించాను. బ్రోకర్లకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాను’’ అని పేర్కొన్నారు. ఈటల తన ప్రసంగంలో పోలీసు వ్యవస్థపై కూడా నిప్పులు చెరిగారు. ‘‘దళారులతో అధికారులు, పోలీసులు కుమ్మక్కవుతున్నారు. పేదల కష్టాలు పట్టించుకోవడం మానేసి కేవలం కూల్చివేతలనే నెరవేరుస్తున్నారు. భాజపా ప్రభుత్వం పేదల హక్కులను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.





