ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దావోస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలపై తన ఆలోచనలు పంచుకున్నారు. ‘‘ఐటీ గురించి మాట్లాడిన రోజుల నుంచి, ఏఐ గురించి చర్చించే స్థాయికి మనం ఎదిగాం. ప్రపంచమంతా ఏఐలో ఎంతో పురోగతి సాధించింది’’ అని అన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్ను మళ్లీ ప్రపంచ పటంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. 1997లో దేశంలో తొలిసారిగా దావోస్ వెళ్లిన సీఎం తనే అని, అప్పటినుంచి ఎన్నో చర్చలు, ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి ఐటీ రంగంలో ఉజ్జ్వల భవిష్యత్తును ఆవిష్కరించానని అన్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో గూగుల్ కేంద్రం ఏర్పాటు, టీసీఎస్ వంటి సంస్థలతో ఒప్పందాలు రాష్ట్రానికి గేమ్ ఛేంజర్గా మారుతాయని వివరించారు.
గ్రీన్ ఎనర్జీ, పరిశ్రమల వృద్ధి
దావోస్ సదస్సులో గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్పై ప్రపంచం దృష్టి పెట్టిందని చంద్రబాబు తెలిపారు. ‘‘రామాయపట్నంలో రూ.95వేల కోట్ల పెట్రో కెమికల్ కాంప్లెక్స్, అనకాపల్లిలో రూ.1.35లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్, కాకినాడ నుంచి గ్రీన్ అమ్మోనియా ఎగుమతులు లాంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి కొత్త వేగాన్ని తెస్తాయి’’ అని పేర్కొన్నారు.
‘‘అభివృద్ధి లక్ష్యాల వైపు నిలకడగా ముందుకెళ్తాం’’
‘‘ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం బలమైన స్థిరత్వాన్ని అనుభవిస్తోంది. 2028 నాటికి జీడీపీ వృద్ధి రేటులో చైనాను అధిగమించగల స్థాయిలో మనం ఉంటాం. గ్రీన్ ఎనర్జీ, పర్యాటకం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వృద్ధితో ఏపీ దేశంలో అగ్రగామిగా నిలుస్తుంది’’ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.






