- మాజీ మంత్రి విడదల రజనీపై స్టోన్ క్రషర్ యాజమాన్యాల నుంచి కోట్లు వసూలు చేసిన ఆరోపణలు
- ఏసీబీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు సిద్ధం, త్వరలో కేసు నమోదు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి విడదల రజనీపై భారీ అవినీతి ఆరోపణలు ఎదురయ్యాయి. ఆమె అధికారం ఉన్నంతసేపు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, ముఖ్యంగా స్టోన్ క్రషర్ యాజమాన్యాల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇందుకోసం ఆమె తన వ్యక్తిగత సిబ్బందిని రంగంలోకి దింపడంతో పాటు, అప్పటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి పల్లె జాషువాను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ బెదిరింపుల నేపథ్యంలో క్రషర్ యజమానులు రెండు కోట్ల రూపాయలు రజనీకి, పది లక్షలు జాషువాకు, మరో పది లక్షలు ఆమె వ్యక్తిగత సహాయకుడికి ఇవ్వాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.
ఏసీబీ విచారణకు సిద్ధం
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, విడదల రజనీ అధికార దుర్వినియోగంపై విజిలెన్స్ విభాగం ప్రత్యేక దర్యాప్తు జరిపింది. రజనీ, జాషువాలు అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డట్లు తేలడంతో, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసులో ముందుగా జాషువాపై విచారణ జరపడానికి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకుంది. ఇక విడదల రజనీపై విచారణకు గవర్నర్ అనుమతి కోరుతూ లేఖ రాసింది. ఈ అనుమతి వచ్చిన వెంటనే, వారిద్దరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించేందుకు ఏసీబీ సిద్ధంగా ఉంది.





