‘నేను యాక్సిడెంటల్ ప్రధాన మంత్రినే కాదు, యాక్సిడెంటల్ ఆర్థికశాఖ మంత్రిని కూడా’’ అంటూ మన్మోహన్ సింగ్ ఓ సందర్భంలో చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుకు వస్తాయి. తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని ఎప్పుడూ మన్మోహన్ అనుకోలదట! ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు చేపడతానని కలలో కూడా ఊహించలేదనట. 1991లో అర్ధరాత్రి సమయంలో వచ్చిన ఒక ఫోన్కాల్ ఆయన జీవితాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేసింది.
ఆర్థిక సంక్షోభం నుంచి ఆర్థిక సంస్కరణల వరకు
1991లో, పీవీ నరసింహారావు భారత ప్రధానమంత్రి అయ్యే సమయంలో దేశం దివాలా స్థితిలో ఉండేది. రాజకీయ పరిస్థితులు గందరగోళంగా ఉండగా, ఆర్థిక వ్యవస్థ కూడా ప్రమాద ఘడియల్లో నిలిచింది. ఈ పరిస్థితుల్లో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్గా ఉన్న మన్మోహన్ సింగ్ నెదర్లాండ్స్లో జరిగిన సదస్సు ముగించుకుని తిరిగివచ్చిన తర్వాత, అర్ధరాత్రి ఆయనకు పీసీ అలెక్జాండర్ నుంచి ఊహించని ఫోన్ వచ్చింది. ‘‘మిమ్మల్ని ఆర్థికశాఖ మంత్రిగా నియమించబోతున్నారు. పని సరిగా చేస్తే క్రెడిట్ అందరికి, తప్పిస్తే పదవి పోతుంది’’ అని చెప్పారు. బిత్తరపోయిన మన్మోహన్ మొదట ఈ విషయాన్ని నమ్మలేకపోయినా, 1991 జూన్ 21న రాష్ట్రపతిభవన్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఆర్థిక సంస్కరణలు:
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే, మన్మోహన్ సింగ్ ఆర్థిక వ్యవస్థకు సరళతరం తీసుకొచ్చేందుకు సంస్కరణలు ప్రారంభించారు. పరిశ్రమలకు లైసెన్స్ నియంత్రణల నుంచి విముక్తి కల్పించారు. గుత్తాధిపత్య వ్యాపార విధానాలను సవరించి, కొత్త పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వరంగ సంస్థల ఆధిపత్యాన్ని తగ్గించారు.





