రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి మరింత పటిష్ఠత అవసరమని, పని చేయకపోతే ప్రజలు మరో అవకాశం ఇవ్వరని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురం నుంచి తన కొత్త రాజకీయ యాత్రను ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రతి గ్రామం తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటానని, వారి ఆశీస్సులతోనే రెండోసారి గెలుపు కోసం ప్రయత్నిస్తానని తెలిపారు.
రాష్ట్రాభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు
పల్లె పండుగ, పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా పిఠాపురంలో గోకులాల ప్రారంభోత్సవం చేసిన పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఆరు నెలల్లో 12,500 గోకులాలను ప్రారంభించామన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే గోకులాల లక్ష్యమని పేర్కొన్నారు. యువతపై వేధింపులకు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. తితిదే సంఘటనపై స్పందించిన పవన్ కల్యాణ్, బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పాల్సిందిగా తితిదే అధికారులను కోరారు.





