విజయవాడలో 35వ పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఇందిరాగాంధీ క్రీడామైదానంలో విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం (వీబీఎఫ్ఎస్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పుస్తకాల పట్ల తన ప్రేమను స్పష్టంగా వ్యక్తం చేశారు.
“నాకు జీవితంలో నిలబడేందుకు ధైర్యాన్నిచ్చింది పుస్తకాలే” అని పవన్ కల్యాణ్ అన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పుస్తక పఠనం అలవాటు పడిందని, అదే తనలో శక్తిని నింపిందని చెప్పారు. “రూ.కోటి ఇవ్వడానికి ఆలోచించను, కానీ నా వద్ద ఉన్న పుస్తకం ఇవ్వాలంటే మాత్రం మనసు ఒప్పుకోదు. పుస్తకం నా జీవన భాగస్వామ్యమైంది” అని ఆయన పేర్కొన్నారు. పుస్తక పఠనం లేకపోతే తన జీవితం ఎలా ఉండేదో అనిపిస్తుందని పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు అక్కడి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో ఆయన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీబీఎఫ్ఎస్ సభ్యులు మహోత్సవ వివరాలను వెల్లడించారు. జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు పుస్తక ప్రదర్శన కొనసాగుతుందని, 270 స్టాళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. మహోత్సవ ప్రాంగణానికి పిడికిటి రామకోటేశ్వరరావు పేరు పెట్టగా, ప్రధాన సాహిత్య వేదికకు రామోజీరావు పేరు పెట్టడం విశేషం.





